TEJA NEWS

తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా తెలంగాణ తల్లి

  • మన కన్నతల్లుల్ని చూసుకున్నంత సంతోషకరంగా కొత్త రూపం
  • సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • డిసెంబర్ 9న లక్షలాది మంది సమక్షంలో వైభవోపేతంగా విగ్రహావిష్కరణ

తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దొరతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్నతల్లిని చూసుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు. విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవోపేతంగా జరుపుతామని ప్రకటించారు.

సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని దశాబ్ది వేడుకల సందర్భంలోనే తాను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

సచివాలయం లోపల తెలంగాణ తల్లి, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, దానికి ఎదురుగా పీవీ నర్సింహారావు, అంజయ్య విగ్రహాలు, జైపాల్ రెడ్డి స్మారకం, ఇటువైపు కాకా వెంకటస్వామి తదితర మహానుభావుల విగ్రహాలు, అమరవీరుల స్మారకచిహ్నం -సచివాలయానికి మధ్య దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం శోభాయమానంగా ఉంటుందని, మేధావుల సూచనల మేరకే ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గడిచిన పదేండ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేసిన గత పాలకులు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో తమ విగ్రహం పెట్టుకోడానికి ప్రయత్నించారని, అయితే ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకొని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్టిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.

తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని వేద పండితులు చెప్పడంతో హుటాహుటిన భూమిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళ వెళ్లడం, మిగతా మంత్రులు ముందే నిర్దేశించిన కార్యక్రమాల్లో ఉండటం వల్ల హాజరుకాలేక పోయారని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS