TEJA NEWS

రేషన్, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన : సీఎం రేవంత్రెడ్డి

సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు నిర్వహణ : సీఎం రేవంత్రెడ్డి
హెల్త్ డిజిటల్ కార్డులకు గ్రామాల్లో శిబిరాల ఏర్పాటు
సీజనల్ వ్యాధులపై అలర్ట్గా ఉండండి..

లేదంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరిక
మంత్రి దామోదరతో కలిసి సీఎం హైలెవల్ రివ్యూ
హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇకపై రేషన్ కార్డులకు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా జారీ చేస్తామని చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం అధికారులనుఆదేశించారు.

మంగళవారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన విధానాలు, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలపై చర్చించారు. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ క్యాంపులు పెట్టాలా? లేదంటే లాబోరేటరీల సాయం తీసుకోవాలా? అనే విషయాన్ని వెంటనే తేల్చాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం చెప్పారు.

డెంగీ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలపై సీఎం సీరియస్

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. డెంగీ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలన్నారు.

పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగీ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS